||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- నలుబది ఆరవ సర్గ||

||"కృత క్షణః కాల ఇవ ప్రజాక్షయ "!||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ షట్చత్త్వారింశస్సర్గః||

తత్త్వదీపిక
నలుబది ఆరవ సర్గ
'కృత క్షణః కాల ఇవ ప్రజాక్షయే'

ఈ సర్గలో ఒక ముఖ్యవిషయము వుంది.
ఇక్కడ పదమూడువేల శ్లోకాలు పూర్తి అవుతాయి.
అంటే పదునాలుగొవ సహస్రములో మొదటి శ్లోకము వుంది
అంటే గాయత్రీమహామంత్రములోని పదునాలుగొవ అక్షరము "ధీ"వుంది అన్నమాట.

పదునాలుగొవ సహస్రములో మొదటి శ్లోకము
అంటే పదమూడువేల ఒకటవ శ్లోకము(13001) ఇది.

"సవాజిరథమాతఙ్గాః స కపిః శాస్యతామితి|
నావమాన్యో భవద్భిశ్చ కపిః ధీరపరాక్రమః||"

అంటే " రథములు అశ్వములు మాతంగములు కల సేనతో ఈ వానరుని శిక్షించుడు
మీచేత ఈ ధీరపరాక్రముడైన వానరుడు అవమానింపబడకుండు గాక" అని

ఈ శ్లోకములో, గాయత్రిలోని పదునాలుగొవ అక్షరము "ధీ"వుంది కనుక
ఈ శ్లోకము మంత్రము గా పరిగణింపబడుతుంది.

ఇక ఈ సర్గలో జరిగిన కథ.
ఈ సర్గ మొదటి శ్లోకములో వాల్మీకి ఇలా రాస్తాడు.

"రావణః సంవృతాకారః
చకార మతి ముత్తమమ్"

"సంవృతాకారః" అంటే మనస్సులోనే మాట దాచుకొనేవాడు
ఎవరు ? ఇక్కడ వాడు రావణుడు.
మనస్సులో ఎందుకు దాచుకుంటున్నాడు?

కింకరులు హతులయ్యారు.
జంబుమాలి హతుడయ్యాడు.
అమాత్యుల ఏడుగురు పుత్రులు కూడా హతమయ్యారు.
రావణుడికి వాలి సుగ్రీవులు తెలుసు.
నీలుడు ద్వివిదులు కూడా తెలుసు.
ఇక్కడ అశోకవనములో వున్నవానరుడు,
వాళ్ళందరినీ మించినవాడులా వున్నాడు.
అందుకని తన మస్సులో అనుమానాలు దాచుకొని,
"చకార మతిముత్తమమ్"
బుద్దితో గట్టిగా ఆలోచించాడు.

ఆ ఆలోచనతో, ఆరితేరిన అగ్ర సేనానాయకులు,
ఐదుమందికి ఆదేశము ఇస్తాడు

ఆ ఐదుమంది అగ్రసేనానాయకులు విరూపాక్షుడు, యూపాక్షుడు,
ప్రఘసుడు, భాసకర్ణుడు, మరియు దుర్ధరుడు అని పేరులు గల వారు.
వాళ్ళు రావణునితో కలిసి దేవతలపై యుద్ధాలలో పాల్గొని విజయము చేపట్టినవారు.

రావణుడి మస్సులోని అనుమానాలు,
వాళ్ళకి ఆదేశము ఇస్తూ చెప్పిన మాటలలో మనకు వెల్లడి అవుతుంది,
ఆ ఐదుమంది అగ్రసేనానాయకులకి రావణుడు ఇలా చెపుతాడు.

' సేనానాయకులు లారా సమస్త గజములు అశ్వములు రథములు కల
మహాబలముతో కూడిన వారై ఆ వానరుని శాసించుడు.
ఆ వనాలయుని సమీపించి దేశకాలానుగుణముగా తగిన రీతిని కార్యము చేపట్టండి.
నేను ఇప్పటిదాకా జరిగిన కర్మలను చూచి అతడు వానరుడు అనుకొనను.

అతడు అన్నివిధములుగా మహత్తరమైన బలము కల మహా ప్రాణి.
మనను జయించుటకు తపోబలముతో ఇంద్రునిచేత గాని
నాగ యక్ష గంధర్వ దేవ అసుర మహర్షుల చేతగాని,
సృష్ఠింపబడి ఉండవచ్చు.

మీ అందరి తో కలిసి వారు అందరినీ నేను జయించితిని కదా.
అయిననూ తప్పక వారు మనకు ఉపద్రవము కలిగించవచ్చు.
దానిలో సందేహము లేదు.
బలముతో అతనిని పరిగ్రహించుడు.
ఆ ధీరపరాక్రమము గల వానరుడు మీచేత అవమానింపబడరాదు'.

' పూర్వము నాచేత అతి పరాక్రమము గల మహాబలవంతులు
వాలీ జాంబవంతుడు సుగ్రీవుడు చూడబడిరి.
నీలుడు ద్వివిదుడు ఇంకా ఇతర సేనాపతులకు
ఇటువంటి వేగము తేజము పరాక్రమము లేవు.
అంత బుద్ధి, బలము ఉత్సాహము శరీరరూప పరికల్పన శక్తి కూడా లేవు.

ఇతడు కపిరూపము ధరించిన మహత్తరమైన ప్రాణి అని తెలిసికొనవలెను.
మహత్తరమైన ప్రయత్నముతో వానిని నిగ్రహించుడు.

ఇంద్రునితో కలిపి ఈ మూడు లోకములలో సురాసుర మానవులలో
యుద్ధరంగములో ఎవరూ మీ ముందు నిలబడ లేరు అన్నది నిజము.
అయిననూ రణములో జయము ఆకాంక్షించు ప్రయత్నములో ఆత్మరక్షణ చేసుకోవలెను.
యుద్దములో సిద్ధి అచంచలము కదా'అని.

అంటే కింకరులు, జంబుమాలి, అమాత్య పుత్రులు అవలీలగా హతమార్చబడడముతో,
రావణుడుకి వాలి సుగ్రీవులకన్నా పరాక్రమము గలవాడు,
ఈ వానరుడు ఎవరా అని అనుమానము రేకెత్తింది.

రావణుని చేత అలాగ ఆదేశింపబడిన ఆ ఐదుగురు సేనానాయకులు
తమ స్వామి వచనములను స్వీకరించి,
మహావేగముతో మత్తెక్కిన మాతంగములతో,
అధిక వేగము కల అశ్వములతో,
తీక్షణమైన శస్త్రములతో కూడిన సైన్యము తీసుకొని బయలు దేరుతారు.

అప్పుడు ఆ సేనానాయకులు తన తేజముతో ఉజ్జ్వరిల్లుతున్న,
సూర్యునివలె వెలుగుతూవున్న ,
మహోత్సాహముతో అశోకవన తోరణముపై కూర్చుని ఉన్న,
మహాబలము కల మహత్తరమైన సత్త్వముగల మహాకపిని చూచి,
వారు అందరూ అన్ని దిశలనుంచి తమ తమ భయంకరమైన అస్త్రములతో దాడిచేస్తారు.

దుర్ధరుడు ఐదు వాడి అయిన ముక్కు గల,
పచ్చని కలువరేకుల రంగుకల,
ఇనుముతో చేయబడిన శరములను హనుమంతుని శిరస్సుపై ప్రయోగించెను.
ఆ వానరోత్తముడు ఆ ఐదు బాణములతో శిరస్సుపై కొట్టబడి,
పది దిశలలో మారుమోగునట్లు పెద్దశబ్దము చేయుచూ ఆకాశములోకి ఎగిరెను.

అప్పుడు దుర్ధరుడు రథముపై నుండి తనధనస్సుతో
వందలకొలదీ తీక్షణమైన బాణములను హనుమంతునిపై ప్రయోగించెను.
శరద్కాలప్రారంభములో నీటితో నిండిన మేఘములను వాయువు అడ్డగించి చెల్లా చెదరు చేసినట్లు,
హనుమంతుడు ఆ దుర్ధరుని శరపరంపరను చెల్లా చెదరు చేసెను.

ఆ దుర్ధరునిచేత ఎదుర్కొనబడిన ఆ అనిలాత్మజుడు తన పనిమొదలెట్టెను.
వేగముగా తన పరిమాణము పెంచెను.
ఆ వానరుడు వెంటనే పైకి ఎగిరి మహావేగముతో
పర్వతముపై పిడుగులు పడినట్లు దుర్ధరును రథముపై పడెను.
ఆ తాకిడికి ఎనిమిది గుఱ్ఱములుకల ఆ రథము భగ్నమైపోగా,
దుర్ధరుడు దానిని వదిలి, జీవితము వదిలినవాడై భూమిపై పడెను.

దుర్ధరులైన ఆ యూపాక్ష విరూపాక్షులు
భూమిమీద పడిన ఆ దుర్ధరుని చూచి మరింత రోషము కలవారు అయిరి.
వేగముగా పైకి లేచిన వారిద్దరి చేత,
విమాలాకాశములో ఉన్న మహాబాహువులు కల ఆ మహాకపి, వక్షస్థలముపై తీవ్రముగా కొట్టబడెను.
మహాబలుడు గరుత్మంతునితో సమానమైన పరాక్రమము గల హనుమ,
వేగముతో వచ్చిన వారిద్దరి ధాటిని ఎదురుకొని భూమిపై దిగెను.
పవనాత్మజుడైన అ వానరుడు అప్పుడు ఒక సాలవృక్షమును తీసుకొని
ఆ యూపాక్ష విరూపాక్షులను ఇద్దరినీ హతమార్చెను.

అప్పుడు అతి బలవంతుడైన వానరోత్తముని చేత
ముగ్గురు సేనానాయకులు హతమార్చబడినట్లు తెలిసికొని,
ప్రఘసుడు మహావేగముతో దాడి చేసెను.
వీరుడు భాసకర్ణుడు కూడా కోపోద్రిక్తుడై శూలము తీసుకు వచ్చెను.

అప్పుడు ఒకవేపు పదునుపట్టిన పట్టిసముతో ప్రఘసుడు,
ఇంకొకవేపు శూలముతో భాసకర్ణుడు హనుమంతునితో యుద్ధము చేయసాగిరి.
వారిద్దరిచేత గాయపడిన హనుమంతుని శరీరము రక్తశిక్తమయ్యెను.
అప్పుడు ఆ హనుమంతుడు ఉదయభానువలె తేజరిల్లుచూ అతికృద్ధుడయ్యెను

వీరుడు కపికుంజరుడు అయిన ఆ హనుమంతుడు,
మృగములు వృక్షములతో కూడిన ఒక పర్వత శిఖరమును పెకలించి
ఆ రాక్షసులను ఇద్దరినీ హతమార్చెను.
ఆ విధముగా ఐదుమంది సేనాపతులను హతమార్చి,
పిమ్మట మిగిలిన సేనా బలములను నాశనము చేయసాగెను.

సహస్రాక్షుడు అసురలను చంపినట్లు,
ఆ హనుమంతుడు అశ్వములను అశ్వములతో,
గజములను గజములతో,
యోధులను యోధులతోనూ,
రథములను రథములతోనూ నాశనము చేయసాగెను.

హతమార్చబడిన గజములతో తురగములతో ముక్కలు చేయబడిన మహారథములతో,
హతమార్చబడిన రాక్షసులతో భూమిలో మార్గములన్నీ నిండి పోయినవి.

అప్పుడు హనుమంతుడు ఆ సైన్యబలములతో కూడిన వాహనములతో కూడిన
ఆ వీరులను రణములో హతమార్చి,
'కృత క్షణః కాల ఇవ ప్రజాక్షయే'
మళ్ళీ అశోకవన తోరణముపై ప్రజలను కబళించు కాలుని వలె నిలబడెను.

అదే మనము వినేది ఈ సర్గలో.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో నలభై ఆరవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||